!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 391-394
ఈ మూడు శ్లోకములలో ( 391-393) బ్రహ్మ స్వరూపము గురించి మళ్ళీ చెపుతూ తరంగములు నురుగు సుడిగుండము మొదలగు వన్నీ నీరే అయినట్లు, శరీరములో దేహము మొదలు లోనగల అహంభావము మొదలగువన్నీ చిత్ స్వరూపమే అని, ఇంద్రియములకు మనస్సుకి కనిపించుచున్న జగత్తు అంతయూ బ్రహ్మమే, మాయా మదిరముతో వచ్చిన భ్రాంతిలో నువ్వు నేను వేరే అనే భ్రమలో పడతారు అని చెపుతాడు గురువు.
శ్లోకము 391
తరంగ ఫేనభ్రమబుద్బుదాది
సర్వం స్వరూపేణ జలం యథా తథా।
చిదేవ దేహాద్యహమంతమేతత్
సర్వం చిదేవై కరసం విశుద్ధమ్॥
1 తరంగ ఫేనభ్రమబుద్బుదాది -
తరంగములు నురుగు సుడులు బుడగలు మొదలగు
2 సర్వం స్వరూపేణ జలం యథా తథా -
అన్నియు స్వరూపములో జలమే అన్నట్లు అలాగే
తరంగములు, వాటి మీద వుండే నురుగు,జల ప్రవాహములో సుడులు, బుడగలు మొదలగువన్నియు నిజానికి జలమే అన్నట్లు అలాగే - అంటే ముందు గురువు చెప్పేబోయే మాట మనం ఊహించవచ్చు - మన దేహము అహంకారము అన్నీ మన లోని మన వికారాలే
3 చిదేవ దేహాద్యహమంతమేతత్ -
దేహాత్ అహమంతం ఏతత్ చిదేవ -
దేహమునుండి అహంకారరము వరకు చిత్ మాత్రమే
4 సర్వం చిదేవై కరసం విశుద్ధమ్ -
సర్వం చిత్ ఏవ ఏక రసం విశుద్దమ్ -
అంతయూ విశుద్ధమైన ఏక స్వరూపము గల చిత్ మాత్రమే
తా॥ తరంగములు నురుగు సుడిగుండములు బుడగలు మొదలగువన్నియూ గూడ స్వరూపముచే నీరే అయినట్లు,దేహము మొదలుకొని అహంభావము వరకు అన్నియూ చిత్ స్వరూపమే. ఈ సర్వమంతయూ ఒక చిత్ రసముతోనే నిండియున్నది.
శ్లోకము 392
సదేవేదం సర్వం జగదవగతం వాఙ్మనసయోః
సతోఽన్యన్నాస్త్యేవ ప్రకృతిపరిసీమ్ని స్థితవతః।
పృథక్ కిం మృత్స్నాయాః కలశఘటకుంభాద్యవగతమ్
వదత్యేష భ్రాన్తస్త్వమహం ఇతి మాయామదిరయా॥
1 సదేవేదం సర్వం జగదవగతం వాఙ్మనసయోః-
సత్ ఏవ ఇదం సర్వం జగత్ అవగతమ్ వాక్ మనసయోః -
1అ :ఇదం సర్వం జగత్ -
ఈ జగత్తు అంతయు;
1బ్ : వాక్ మనసయోః సత్ ఏవ అవగతమ్ -
వాక్కు చేతనూ మనస్సు చేతనూ సత్ రూపముగా అవగతమగుచున్నది;
ఈ జగత్తు అంతయు వాక్కు చేతనూ మనస్సు చేతనూ సత్ రూపముగా అవగతమగుచున్నది;
2 సతోఽన్యన్నాస్త్యేవ ప్రకృతిపరిసీమ్ని స్థితవతః
ప్రకృతిపరిసీమ్ని స్థితవతః -
ప్రకృతి కంటే పరమైన బ్రహ్మమునందు ఉన్నవానికి;
సతోఽన్యన్నాస్త్యేవ - సతః అన్యత్ నాస్త్యేవ-
సత్ కన్న భిన్నమైనది కాదు;
ప్రకృతి కంటే పరమైన బ్రహ్మమునందు ఉన్నవానికి; కనిపించేది అంతా సత్ మాత్రమే ; సత్ కన్న భిన్నమైనది కాదు;
3 పృథక్ కిం మృత్స్నాయాః కలశఘటకుంభాద్యవగతమ్
కలశఘటకుంభాద్యవగతమ్ - కలశ ఘట కుంభ ఆది అవగతమ్-
అవగతము అగుచున్న కలశ ఘట కుంభము మొదలగునవి ;
పృథక్ కిం మృత్స్నాయాః -
మట్టికన్న భిన్నమైనవా ఏమి?;
అవగతము అగుచున్న కలశ ఘట కుంభము మొదలగునవి మట్టికన్న భిన్నము కావు.;
4 వదత్యేష భ్రాన్తస్త్వమహం ఇతి మాయామదిరయా
మాయామదిరయా - మాయ అనబడే మదిరముతో;
భ్రాన్తస్త్వమహం ఇతి వదతి - భ్రాన్తః త్వం అహం ఇతి వదతి -
భ్రాంతిలో నువ్వు నేను అని పలుకు చున్నాడు;
మాయ అనబడే మదిరముతో భ్రాంతిలో నువ్వు నేను అని పలుకు చున్నాడు - అంటే నిజానికి నువ్వు నేను లో భిన్నము లేదు - అందరూ బ్రహ్మ స్వరూపములే; ఎలాగ కలశ ఘట కుంభము మొదలగునవి మట్టికన్న భిన్నము కావో - అలాగే నువ్వు నేను అందరమూ బ్రహ్మ స్వరూపములే- మాయ అనబడె మదిరముతో భ్రాన్తిలో వున్నవాడు నువ్వు - నేను , అలాగే నువ్వా- నేనా అని అంటాడు. నిజానికి నువ్వు నేనులో భేదము లేదు.
తా॥ ఇన్ద్రియములకు మనస్సుకి కనిపించుచున్న ఈ జగత్తు అంతయునూ ( సత్ ఏవ ఇదం సదేవాదమ్) బ్రహ్మ స్వరూపమే. ప్రకృతి పరిధిని దాటి ఉన్నది కూడా బ్రహ్మమే, కాని వేరైనదికాదు. మట్టితో చేయబడిన కుండలు ముంతలు బానలు మొదలగువన్నియు మట్టి కంటే వేరైనవి ఎట్లు కాగలవు? మాయామదిరముచే అంటే మాయ అను కల్లుచే భ్రాన్తులైన వారు నీవు నేను అని పలుకుచుందురు
శ్లోకము 383
క్రియాసమభిహారేణ
యత్రనాన్యదీతి శ్రుతిః
బ్రవీతి ద్వైతరాహిత్యం
మిథ్యాధ్యాసనివృత్తయే।।
1 క్రియాసమభిహారేణ : మాటి మాటికి
4 మిథ్యాధ్యాసనివృత్తయే - అసత్యమైన భేద భ్రమ నివృత్తి కొరకు
3 ద్వైతరాహిత్యం - భేదభావము తొలగించుటకు
2 యత్రనాన్యదీతి శ్రుతిః బ్రవీతి- యత్ర నాన్యత్ ఇతి శ్రుతిలో చెప్పబడుచున్నది
భేదభావము తొలగించుటకు శ్రుతులలో చెప్పబడిన మాట , "యత్ర నాన్యత్ ఇతి" అని;
జగత్తు, అంతా బ్రహ్మ స్వరూపము కాదు అని, భేదములు వున్నాయి అనే భ్రమ తొలగించడానికి శ్రుతులు ఏమన్నా చెపుతున్నాయా ? శ్రుతులు చెపుతున్నమాట ఏమిటి - అని వచ్చే ప్రశ్నకి గురువు సమాధానము చెపుతున్నాడు. 'భేద నివృత్తికొరకు, శ్రుతులు "యత్ర న అన్యత్ ఇతి" అన్న వాక్యముతో చెపుతున్నాయి' అని; అప్పుడప్పుడు గురువు తను చెపుతున్నమాట శ్రుతులు కూడా చెపుతున్నాయి అని చెప్పడానికి శ్రుతి వాక్యములో ఒక చిన్నమాట తో బలపరస్తూ వుంటాడు. ఇక్కడ చెప్పిన "యత్ర న అన్యత్ ఇతి" అన్న వాక్యము పూర్తిగా వినతగ్గది. అది: " యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి న అన్యత్ విజానాతి స భూమా" - అంటే- 'ఎక్కడ ఇంకొకటి కనపడదో వినపడదో ఇంకొకటి తెలియబడదో అదే అనంతము' - తుది మొదలు లేని ఆ అనంతమే బ్రహ్మము. ఎక్కడ ఏదో చూస్తామో వింటామో దానికి తుది మొదలు వున్నాయి- తుది మొదలు వున్నవి క్షనికాలు , అవి అనిత్యము. అనిత్యము సత్ రూపముకాదు. అంటే బ్రహ్మముకాదు అని. శ్రుతులు కూడా బ్రహ్మములో భేదభావము లేదు అని ఉద్ఘాటిస్తున్నాయి అన్నమాట.
తా॥ మిథ్యాజ్ఞానము (వలన కలిగిన దేహాది భావమును ) పోగొట్టుటకు శ్రుతులు ద్వంద్వ రాహిత్యమును, యత్రనాన్యదితి అను పలుక్రియలతో చెప్పుచున్నవి.
||ఓం తత్ సత్ ॥
____________________________________________________
__________________________________